🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 24 Jul, 2026 | Page: 1

‘మంగళవారం 2’పై అజయ్ భూపతి బిగ్ అప్‌డేట్..

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, ‘మహాసముద్రం’ తో నిరాశపరిచినా, ‘మంగళవారం’ చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్‌పై వస్తున్న వార్తలకు అజయ్ భూపతి అధికారికంగా స్పందించారు. ‘మంగళవారం 2’ తప్పకుండా తెరకెక్కుతుంది. ఈసారి ప్రేక్షకులు ఊహించని స్థాయిలో కథను సిద్ధం చేస్తున్నాం. మొదటి భాగానికి పూర్తి భిన్నంగా, మరింత థ్రిల్లింగ్ అనుభూతిని అందించేలా సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ఈసారి కథలో సూపర్ నేచురల్ అంశాలకు పెద్దపీట వేస్తున్నామని అజయ్ భూపతి వెల్లడించారు. ప్రతి పాత్ర, ప్రతి సంఘటన ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేసేలా కథను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్నానని, ఆ సినిమా విడుదలైన తర్వాత పూర్తిస్థాయిలో ‘మంగళవారం 2’ స్క్రిప్ట్‌పై దృష్టి పెడతానని తెలిపారు.
🏠 Home