‘విద్యార్థుల నిరసనపై కేంద్రం మూర్ఖంగా వ్యవహరించింది’..
లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిల్లుపై మాట్లాడుతూ.. పేపర్ లీక్పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు, వారి పిల్లలను అడగాలంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని.. భావ వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు.విద్యార్థుల ఆందోళనను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గౌరవించాలని రాహుల్ పిలుపునిచ్చారు. తీవ్ర వేదన తర్వాతే విద్యార్థులు ఆందోళన చేశారని.. కానీ వారి నిరసనను కేంద్రం అర్థం చేసుకోలేదని విమర్శించారు. కేంద్రం మూర్ఖంగా వ్యవహరించిందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారని మండిపడ్డారు. మూర్ఖులు ఎవరి మాటలు వినరని.. ప్రభుత్వంలో ఉన్నవారు తమ ఆవేదనను పట్టించుకోరని విద్యార్థులు చెప్పారన్నారు.