🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 30 Jul, 2026 | Page: 1

‘సింగరేణి ఆస్తుల సంరక్షణలో శాలెం రాజు సేవలు చిరస్మరణీయం’

కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా విశిష్ట సేవలందించి శుక్రవారం పదవీ విరమణ పొందనున్న ఎం.శాలెం రాజును ఏరియా ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు గురువారం ఏరియా ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ అధికారి అభిలాష్ మాట్లాడుతూ.. సింగరేణిలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెం ఏరియా ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలో ఫీడర్ క్యాంటీన్ ఏర్పాటు కావడం శాలెం రాజు చొరవతోనే సాధ్యమైందని తెలిపారు. అలాగే ఏరియాలోని వివిధ చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి పరిష్కరించేవారని, సిబ్బంది మనోధైర్యాన్ని పెంపొందించేలా ఎల్లప్పుడూ అండగా నిలిచారని అన్నారు. చాతకొండ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల సింగరేణి భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుని తిరిగి సంస్థ స్వాధీనంలోకి తీసుకురావడంలో శాలెం రాజు చూపిన చొరవ, ధైర్యసాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు.
అంతేకాకుండా సింగరేణి భూములు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు, ఉత్పత్తి, ఉత్పాదకతకు ఎలాంటి ఆటంకం కలగకుండా వివిధ విభాగాల అధికారులతో సమన్వయం చేస్తూ కొత్తగూడెం ఏరియాను ముందంజలో నిలిపారని అభిలాష్ పేర్కొన్నారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన ఆయన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని అన్నారు.
🏠 Home