రైతులు తక్కువ కాల పరిమితి వరి వంగడాలను సాగు చేయాలి’
మిర్యాలగూడ, జూన్ 9 : దేశ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, రైతులు తప్పనిసరిగా వరి వేయాల్సి వస్తే తక్కువ కాల పరిమితి గల వరి వంగడాలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని రైతు వేదికలో డివిజన్ పరిధిలోని ఎరువుల దుకాణాల డీలర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎరువుల దుకాణాలలో నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అందించాలని, లైసెన్సులు లేకుండా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్ మాసంలో కొద్దిపాటి వర్షాలు ఉంటాయని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వర్షాలు లేకపోవడం వల్ల వరి సాగు చేసిన వారికి నీటి కొరతతో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు.