🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 29 Jun, 2026 | Page: 1

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన సూచ‌న‌లు ఇవే..

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే కేవలం ఏం తింటున్నామనేదే కాదు, ఎప్పుడు తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసే సమయం రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. శరీరం సహజ జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్) ప్రకారం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా భోజన సమయాలను పాటిస్తే భోజనం తర్వాత చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉండటమే కాకుండా, దీర్ఘకాలికంగా హెచ్‌బీఏ1సీ స్థాయిలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, నరాలు దెబ్బతినడం, కంటి చూపు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే సమతుల ఆహారంతోపాటు సరైన భోజన సమయాలను పాటించడం కూడా చికిత్సలో కీలక భాగంగా పరిగణిస్తారు. పీచుపదార్థాలు అధికంగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు రక్తంలో చక్కెర నెమ్మదిగా శోష‌ణ‌కు గుర‌య్యేలా చేస్తాయి. అలాగే గింజలు, నట్స్, అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
రోజూ ఒకే స‌మ‌యానికి తినాలి..
రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండాలంటే ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. భోజనాల మధ్య ఎక్కువ విరామం ఉంటే తీవ్రమైన ఆకలి వేయడంతో ఒకేసారి ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరుగుతుంది. అదే తరచూ తినడం వల్ల కూడా గ్లూకోజ్ స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు రోజుకు మూడు ప్రధాన భోజనాలను నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రెండు భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే ఆరోగ్యకరమైన చిరుతిండిని తీసుకోవచ్చు. ముఖ్యంగా రక్తంలో చక్కెరను తగ్గించే మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం నిద్రలేచిన గంటలోపు అల్పాహారం తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జీవక్రియలు చురుకుగా ప్రారంభమవుతాయి. అలాగే ఇన్సులిన్ నిరోధకత తగ్గేందుకు సహాయపడుతుంది. అల్పాహారాన్ని ఆలస్యం చేసే కొద్దీ ఉపవాస రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆహారాన్ని ఇలా తీసుకోవాలి..
మధ్యాహ్న భోజనాన్ని సరైన సమయంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. మధ్యాహ్నం అలసట తగ్గడంతోపాటు సాయంత్రం అతిగా తినే అలవాటు కూడా తగ్గుతుంది. రాత్రి భోజనాన్ని తేలికగా, నిద్రపోయే సమయానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే ముగించడం వల్ల రాత్రిపూట రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగుపడుతుంది.
🏠 Home