Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం

    Author VENKATESH | 02 Jul 2026, 12:10 AM | నారాయణపేట
    ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం

    డీఎస్పీ నల్లపు లింగయ్య
    ...180 ఇళ్లలో తనిఖీలు పత్రాలు లేని 55 వాహనాలు సీజ్
    కొత్త వ్యక్తుల కదలికలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, సీసీ కెమెరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన
    నారాయణపేట, జూలై 1 (బీవీకే న్యూస్)
    జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం లక్ష్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని భీమండి కాలనీలో బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డెన్ అండ్ సెర్చ్) నిర్వహించినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.
    ఈ సందర్భంగా మొత్తం 75 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కాలనీలోని 180 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
    అదేవిధంగా కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని వివరించారు. కొత్త వ్యక్తులు కాలనీలో నివాసం ఉంటే వారి వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
    ప్రజల భద్రత కోసం ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండే విధానాలపై అవగాహన కల్పించారు.
    ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ... జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాములను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. కాలనీల్లో అద్దెకు వచ్చే వ్యక్తుల పూర్తి వివరాలను గృహ యజమానులు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు అందించాలని సూచించారు. అనుమానాస్పద కదలికలు, నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియజేయవద్దని ప్రజలకు సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి వాహనాల సంబంధిత పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో సీఐ శివ శంకర్, ఎస్ఐ లు ఏ వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, నరేష్, కృష్ణ చైతన్య, గాయత్రి, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.